gunturnews.in

ప్రజల సహకారంతో స్వచ్ఛ నగరంగా గుంటూరు – కమిషనర్‌ మయూర్‌ అశోక్‌

మార్కెట్‌ లో ఊడుస్తున్న మేయర్‌ రవీంద్ర, కమిషనర్‌ మయూర్‌ అశోక్‌


గుంటూరు 24-01-2026 శనివారం : గుంటూరు నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా తీర్చి దిద్దటానికి నగర ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమని నగర మేయర్‌ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పివికే నాయుడు మార్కెట్‌ పరిసర ప్రాంతాల మాస్‌ క్లీనింగ్, శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురు ఉన్న టాయ్‌ లెట్స్‌ ను నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ తో కలిసి మేయర్‌ పరిశీలించి తదుపరి విజ్ఞాన మందిరం వద్ద అధికారులు సిబ్బందిచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగర ప్రజలకు పారిశుద్ధ్య లోపాల వలన కలరా వంటి అంటు వ్యాధులు రాకుండా నగరంలో ఎప్పటికప్పడు గార్బేజ్‌ కలెక్షన్, డ్రైన్స్‌ క్లీనింగ్, పత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని నగరంలోని అన్ని డివిజన్లలో నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని క్లీన్‌ గుంటూరు గ్రీన్‌ గుంటూరు గా తీర్చి దిద్దటానికి కషి చేస్తున్నామని, దీనికి నగర ప్రజలు, ప్రజా ప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఈ నెల థీం జీరో గ్యాప్‌ శానిటేషన్‌ అనే అంశం పై నిర్వహిస్తున్నామని పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎన్ని చేసిన ఎక్కడో ఒక చోట గ్యాప్‌ ఉంటుందని ఇటువంటి గ్యాప్‌ లను గుర్తించి, అటువంటి ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గుంటూరు నగరంలో ఇప్పటికే డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ నూరు శాతం జరుగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని అన్ని డివిజన్లలో గ్యాంగ్‌ వర్క్‌ లు, డ్రైన్‌ క్లీనింగ్‌ వంటి కార్యక్రమాలు చేయుటయే కాక, తడి పొడి చెత్తల విభజన పై, పబ్లిక్‌ టాయిలెట్స్‌ శుభ్రత పై కూడా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, కావున ప్రజలు ఈ స్వచ్చ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలియచేశారు.

Exit mobile version