
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముసుగులో మహిళలను పెళ్లి చేసుకొని మోసగిస్తున్న వైనంపై ఇరువురు బాధితులు పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు.
బాధితుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. రేపల్లెకు చెందిన ఓ యువతి అతనికి దూరపు బంధువు కావడంతో శుభకార్యాలకు హాజరయ్యే సమయంలో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఆ యువతి డిగ్రీ చదువుకొని హైదరాబాద్లో ఉంటోంది. ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వారి పెళ్లికి అమ్మాయి పెద్దలు అంగీకరించకపోవడంతో 2019లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పెద్దలు వారి పెళ్లిని సమ్మతించారు. ఆమె గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి పంపించాడు. తర్వాత నుంచి ఆమెను పట్టించుకోలేదు. అధిక కట్నం తీసుకురమ్మని వేధించేవాడు. వారికి ఒక బాబు. అయినా ఆమెను కాపురానికి తీసుకెళ్లలేదు. పెద్దల సమక్షంలో మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో అతనిపై పోలీసుస్టేషన్లో, కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో శ్రీకాంత్ పెళ్లిళ్ల మధ్యవర్తుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఎంసీఏ చదువుకున్న ఓ యువతి తల్లిదండ్రులను సంప్రదించాడు. రూ.5లక్షలు కట్నం, ఇతర లాంఛనాలు తీసుకొని 2023లో వివాహం చేసుకున్నాడు. ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉండగా పుట్టింటి వద్ద దించేశాడు. వీరికి ఒక బాబు. శ్రీకాంత్కు మొదట వివాహం జరిగినట్లు ఆమెకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నట్లు ఖమ్మం మహిళకు తెలిసి ప్రశ్నించింది. ఇక అప్పటి నుంచి ఆమె ఇంటికి వెళ్లడం మానేశాడు. అదేమని అడిగితే అసలు తనను పెళ్లి చేసుకోలేదని, 2013 నుంచి సహజీవనం చేస్తున్నానంటూ బుకాయిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఇంతలో మరో యువతి ఫోటో మార్ఫింగ్ చేసి ఆమెను వివాహం చేసుకుంటున్నానని, వీరికి పంపించి బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో బాధిత మహిళలు ఇద్దరు సోమవారం ఎస్పీ కార్యాలయంలో తమను మోసగించిన అతనిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
