gunturnews.in

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో మసీదుల వద్ద సంతకాల సేకరణ


– ముఖ్యఅతిధులుగా హాజరైన జిల్లా అధ్యక్షుడు అంబటి, నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా

గుంటూరు జిల్లాలోని చినకాకానిలో ఉన్న అంజుమన్‌ భూములు 71.57 ఎకరాలకు సంబందించి ఐటీ పార్క్‌ నిర్మాణానికి నోటిఫీకేషన్‌ జారీ చేసిన క్రమంలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఆలోచనతో ముస్లీం మైనారిటీల భూములను కాజేసే ప్రయత్నం చేస్తోందన్నారు. దశాబ్దాల క్రితం దాతలు ముస్లీంలకు మేలు జరగాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన భూములను ధారాదత్తం చేసే దిశగా కుట్రలు చేయటం సిగ్గుచేటన్నారు. ఇప్పటీకే దీనిపై ముస్లీం మైనారీటీల్లో ఆగ్రహాజ్వాలలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో వైఎస్సార్‌ సీపీ మైనారిటీలకు అండగా ఎంతటి పోరాటానికి వెనుకాడదన్నారు. నల్లచెరువులోని మసీదు వద్ద, తూర్పు నియోజకవర్గంలోని ఇక్బాల్‌ మసీదు వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. సంతకాల సేకరణ కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. నల్లచెరువు మసీదు వద్ద జరిగిన కార్యక్రమానికి అంబటి, నూరిఫాతిమా హాజరుకాగా, ఇక్బాల్‌ మసీదు వద్ద నూరిఫాతిమా స్వయంగా పాల్గొని సంతకాలు చేయించారు.

వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా మాట్లాడుతూ అంజుమన్‌ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యావత్‌ ముస్లిం సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారని, కులాలకు, మతాలకు అతీతంగా సంఘీభావం లభిస్తోందన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో సైతం ఈస్ట్, వెస్ట్‌ నియోజకవర్గాల్లో ముస్లీం సామాజికవర్గాలు అధికంగా నివసించే ప్రాంతాల్లో సంతకాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30 న గుంటూరు నగరంలో భారీ నిరసన ర్యాలీ నగరంపాలెం ఈద్గా నుండి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు వెళ్లి జిల్లా కలెక్టర్‌కు సేకరించిన సంతకాలను అందజేస్తామన్నారు. చంద్రబాబు సర్కార్‌ అంజుమన్‌ భూముల ఆలోచనను విరమించుకొని పక్షంలో భవిష్యత్తు ఆందోళన కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ గులాంరసూల్‌ మాట్లాడుతూ రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ముస్లీం సోదరుడు మన హక్కుల కోసం జరిగే పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పఠాన్‌ సైదాఖాన్, ఈస్ట్, వెస్ట్‌ అధ్యక్షులు షేక్‌ లియాఖత్, ఖాసీంబేగ్, కార్పొరేటర్‌ ఫర్జానా, ఆయూబ్‌జానీ, షేక్‌ అప్సర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందేటి రాజేష్, తూర్పు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు షేక్‌ సుభాని, ఉపాధ్యక్షుడు వైఎస్సార్‌ రబ్బాని, సూరజ్, షరీఫుద్దీన్, షేక్‌ ఉమర్‌ ఫారూక్, ఐటీ విభాగ విభాగం అధ్యక్షుడు షేక్‌ రహీమ్, నగర బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు పల్లపు మహేష్‌బాబు, మైనారిటీ విభాగం నేతలు షేక్‌ బషీర్, సుభాని ,జాఫరుల్లాహ్‌ఖాన్, షేక్‌ సైదా , షేక్‌ మహబూబ్‌ సుభాని ,షేక్‌ కూతుబుద్దీన్‌ ,షేక్‌ బషీర్‌ సయ్యద్‌ నాగూర్‌ , జబీవుల్లాహ్‌ ఖాన్‌ ,సయ్యద్‌ సలాం మొగల్‌ ,షేక్‌ షంషేర్, బుల్లెట్‌ సలీం తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version