gunturnews.in

గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావును ఘనంగా సత్కారించిన టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఖలీలుద్దీన్

గుంటూరు 24-01-2026 శనివారం : గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పిల్లి మాణిక్యరావును రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీలుద్దీన్ ఆధ్వర్యంలో టిడిపి మైనార్టీ సెల్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడగా, పార్టీ పటిష్టత, భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీలుద్దీన్ మాట్లాడుతూ, పిల్లి మాణిక్యరావు వంటి అనుభవజ్ఞుడు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన, పార్టీ సిద్ధాంతాలపై అచంచల విశ్వాసం కలిగిన నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉందని ప్రశంసించారు. గుంటూరు జిల్లా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఇక్కడ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడంలో పిల్లి మాణిక్యరావు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే, మైనార్టీ వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కాలం నుంచే మైనార్టీలకు సముచిత గౌరవం, అవకాశాలు కల్పించిన పార్టీగా టిడిపి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. రానున్న రోజుల్లో మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, తనపై పార్టీ అధిష్టానం ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా, అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలతో నిరంతర సంబంధం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ సెల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పిల్లి మాణిక్యరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ సెల్ నాయకులు హాజీ లాల్ వజీర్, షేక్ బాజీ మాస్టారు కె ఇ హుసేన్, తదితరులు పాల్గొన్నారు

Exit mobile version