
ప్రజా స్వామ్యంలో ఏక్దిన్కా సుల్తాన్ అని పిలువబడేది ఓటరే. ఎలక్షన్ రోజున ఆయన దేశానికే రారాజు. అటువంటి రాజుగా భావించబడుతున్న ఓటరు 5 ఏళ్ళపాటు ప్రజాప్రతినిధిగా పనిచేసే వ్యక్తిని జాగ్రత్తగా ఎన్నుకోవలసి వుంటుంది.
అభ్యర్థికి ఓటు వేసేటపుడు అతను ఇప్పటి వరకూ ఏం వెలగబెట్టాడో చూడండి. ఇప్పటిదాకా ఏంచేశాడో చూడండి. ప్రజాస్వామ్యాన్ని నిల బెట్టేందుకు ఓటును కచ్చితంగా వేయాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన వారు కావాలి.ఎలక్షన్డేను హాలిడేగా భావించొద్దు1
మీకు సంస్కారం వుంది. కాబట్టి చెప్పుతో కాదు కసితీరా ఓటుతో కొట్టు. డబ్బు, మద్యానికి బానిస కావద్దు. ఓటును అమ్ముకోవద్దు.
ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది
ఓటు హక్కు.. రాజ్యాగం కల్పించిన ఓ వరం..
5ఏళ్ల మన భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం..
మన సంక్షేమాన్ని గురించి ఎంచుకునే హక్కు..
ముఖ్యంగా ఓ మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే బాధ్యత..
ఇవన్నీ ఓటు హక్కు ద్వారా సాధించేవే.. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే ఏర్పాటుచేయబడిన ప్రభుత్వం కలిగిన దేశం. ప్రభుత్వాన్ని ఎన్నుకోవటంలో ప్రజలు పోషించే పాత్రే ప్రజాస్వామ్యం.
రాజకీయ ప్రక్రియలో మరింత మంది యువకులు భాగస్వాములయ్యేందుకు వీలుగా ప్రతిఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రప్రభుత్వం 2011లో నిర్ణయించింది. కేంద్ర న్యాయశాఖ చేసిన ఈ ప్రతిపాదనను అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని మంత్రివర్గం ఓకే చేసింది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేయటం జరిగింది. ప్రజాస్వామ్య ప్రతిష్టత అనేది ఎన్నికలపైనే ఆధారపడివుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతులలో దేశ భవిష్యత్తును ఓటర్లు పెడుతున్నారు. ఆ ప్రజాప్రతినిధులే లంచగొండులయితే, భూ బకాసురులు అయితే ఇక ఆ దేశం అధోగతే. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల సంఘం కీలకపాత్ర వహిస్తుంది. ఏ రాజకీయ పార్టీకి తలవంచక స్వతంత్రంగా విధులు నిర్వహిస్తుంది. కేంద్రస్థాయిలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ప్రజాస్వామ్య మనుగడ ప్రతిష్ఠత ఓటరుపైనే ఉన్నందువలన ఎన్నికల సంఘం ప్రజలను నిరంతరం చైతన్యం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వటం జరిగింది. 18 సం||లు దాటిన యువతీయువకులు ఓటరుగా ధరఖాస్తు చేసుకోవాలి. అవగాహన కోసం ప్రతి కళాశాలలో విద్యార్థులకు ఓటరుగా నమోదు, ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్య పరిరక్షణపై పోటీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు, వ్యాసరచన, చిత్రలేఖనం, డిబేటింగ్ పోటీలు నిర్వహించి ఓటర్స్ డే రోజున వారికి బహుమతులు అందజేయటం ఆనవాయితీగా జరుగుతోంది.
”ఓటరుగా వున్నందుకు గర్వపడుతున్నా – ఓటు వేయటానికి సిద్దంగా వున్నా” అను నినాదాన్ని విద్యార్థులంతా చేస్తున్నారు. ఓటరు మీద అవగాహన లేకపోవటంవలననే ఎన్నికలలో పోలింగ్ శాతం తగ్గుతుంది.
ఈ మద్యకాలంలో నోటుకోసం, మద్యంకోసం ఓటు హక్కు దుర్వినియోగమవుతోంది. కొంతమందైతే ఓటుహక్కు వినయోగించుకోవడాన్నే మానేశారు. ఎన్నికలరోజులను హాలిడేగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకరం. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత.
దురదుష్టవశాత్తూ ఎన్నికలలో కుల, మతం, ప్రాంతం, భాషా పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నేరస్తులకు టిక్కెట్లు ఇస్తున్నారు. అరాచక శక్తులు ఎన్నికలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రజలు అవగాహనతో ఓటుహక్కు వినియోగించుకోవాలి.